This Blog is Under Construction...!!!

Wednesday, September 20, 2017

మలేరియా..! మరి జాగ్రత్త!!

ఎండాకాలం అయిపోయి వర్షాకాలం మొదలయ్యిందంటే అప్పుడు మొదలయ్యే ఆరోగ్య సమస్యల గురించి ముందే అవగాహన కలిగి ఉంటే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొవడానికి అవకాశం ఉంటుంది. అందుకే వర్షాకాలం మొదలు కాక ముందే వర్షాల్లో వచ్చే జబ్బుల గురించి తెలుసుకొని జాగ్రత్త పడడం అవసరం. అందుకే మండు వేసవిలో మలేరియా విశేషాలు ఎప్రిల్ 25 వరల్డ్ మలేరియా డే ను పురస్కరించుకుని....


మలేరియా వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే ఆరోగ్య సమస్య. ఇది దోమ కాటువల్ల వ్యాపిస్తుంది. మలేరియాను కలుగజేసే పరాన్న జీవి ప్లాస్మోడియం. ఇది దోమ నుంచి మనిషిలోకి చేరి మలేరియాకు కారణమవుతుంది. మలేరియా పరాన్నజీవికి అనాఫిలిస్ జాతికి చెందిన ఆడ దోమ వాహకంగా ఉంటుంది. మలేరియా ప్రాణాంతక వ్యాధి. 2015 సంవత్సరంలో దాదాపు 214 మిలియన్ల మలేరియా కేసులు నమోదు అయ్యాయి. వీరిలో దాదాపు 4లక్షల 38 వేల మంది మరణించారు. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది ఈ వ్యాధి బారిన పడే అవకాశాలున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా.


నిర్లక్ష్యం తగదు
దోమకాటుకు గురైన వ్యక్తిలో దాదాపు 10-15 రోజుల్లోపు మలేరియా లక్షణాలు బయటపడతాయి. మలేరియా వ్యాధిలో ముఖ్యంగా తీవ్రమైన జ్వరం, చలి, వణుకు, వాంతులు, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు సాధారణంగా ఏ జ్వరంలో నైనా కనిపించేవే. ఈ లక్షణాలను బట్టి మలేరియాను నిర్ధారించడం కష్టమే. మాములు జ్వరమే కదా అని ఏ పారాసిటమాల్ టాబ్లెటో వేసుకుంటే అప్పటికి జ్వరం, ఇతర లక్షణాలు తగ్గినప్పటికి రెండు మూడు గంటల వ్యవధిలో తిరిగి జ్వరం వస్తుంది. మలేరియా జ్వరం రాత్రుళ్లు ఎక్కువగా ఉంటుంది. చెమటలతో జ్వరం తగ్గి కొంత విరామంతో తరచుగా జ్వరం వస్తూ ఉంటే మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. మలేరియాను క్లినికల్‌గా నిర్ధారించి ప్రత్యేక చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.

మలేరియాలో రకాలు
మలేరియా కలుగజేసే ప్లాస్మోడియం పరాన్న జీవి నాలుగు రకాలు.
ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఓవలే, ప్లాస్మోడియం మలేరియే. వీటిలో మన దేశంలో ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ కనిపించే రకాలు. వీటిని ప్రత్యేకంగా నిర్ధారించడానికి యాంటిజెన్, స్మియర్ టెస్ట్‌లు తప్పనిసరి. యాంటిజెన్ పరీక్షల్లో చాలా కచ్చితమైన ఫలితాలు వస్తాయి. ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ చాలా ప్రమాదకరమైన సెరిబ్రల్ మలేరియాకు కారణమవుతుంది.

చికిత్స
జ్వరం మలేరియా అయినా కూడా ఏ రకమైన మలేరియా అనే అంశం మీద ఆధారపడి చికిత్స ఉంటుంది. సాధారణంగా ప్లాస్మోడియం వైవాక్స్ చికిత్సకు క్లోరోఫిన్ అనే మందునే వాడుతారు. మొదటి డోస్‌గా 600 ఎంజీ, రెండు గంటల విరామంతో రెండో డోస్‌గా 300 ఎంజీ ఇస్తారు. తర్వాత రెండు రోజుల పాటు 300 ఎంజీ చొప్పున ఇస్తారు.తర్వాత 14 రోజుల పాటు ప్రైమోక్విన్ అనే మందును కొనా పరిస్థితి ఎలా ఉందో ముందుగా ఒకసారి పరీక్షించి నిర్ధారించుకున్న తర్వాత చెయ్యాల్సి ఉంటుంది. అయితే కొంత మందిలో క్లోరోఫిన్ మందు పనిచేయదు. దీనిని క్లోరోఫిన్ రెసిస్టెంట్ మలేరియా అంటారు. వీరికి రెండు మూడు రకాల కాంబినేషన్‌లో మందులు వాడాల్సి ఉంటుంది. ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ వల్ల కలిగే మలేరియాను సెరిబ్రెల్ మలేరియా అంటారు. ఈ రకమైన జ్వరానికి క్వినైన్ అనే మందు వాడతారు. ఇది కొంత ఎక్కువ డోస్ మందు అయినప్పటికి తప్పదు.

అశ్రద్ధ కూడదు
సెరిబ్రెల్ మలేరియా ప్రమాదకరం చాలా త్వరగా పరిస్థితి విషమించే ప్రమాదం ఉంటుంది. దీనిని ఎంత త్వరగా గుర్తించి అంత త్వరగా చికిత్స మొదలు పెడితే అంత మంచిది. సెరిబ్రల్ మలేరియాతో వచ్చిన పేషేంట్లు చాలా వరకు తమకు ఏం జరుగుతోందో చెప్పే పరిస్థితిలో ఉండరు. మెదడు మీద ప్రభావం ఉండడం వల్ల చాలా వరకు కన్‌ఫ్యూషన్, మాట తడబడడం, ఏం మాట్లాడుతున్నారో తెలియనట్టు మాట్లాడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు వాంతులు, తీవ్రమైన తలనొప్పి, జ్వరం మాములుగా కనిపించే లక్షణాలు. మలేరియాను అశ్రద్ధ చేస్తే రకరకాల ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తియ్యవచ్చు. లివర్ ఫెయిల్యూర్, లంగ్ ఫేయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ప్రాణాంతక పరిస్థితికి కారణమవుతుంది. ఒక్కోసారి చిన్నపిల్లల్లో మలేరియా సోకినపుడు లోపల జ్వరం ఉన్నప్పటికి పైన తాకి చూసినపుడు చల్లగా ఉంటారు. ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ రకం మలేరియాలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఇది మన దేశంలో చాలా అరుదు.

  • రెండు వర్షాల మధ్య కాలంలో నిల్వ ఉన్న నీటిలో దోమలు వృద్ధి చెందుతాయి కాబట్టి నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. 
  • దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలు, వెంటీలేటర్లకు నెట్ అమర్చుకోవాలి
  • దోమలు ఉన్నాయనుకున్నపుడు క్రిమ సంహారక మందులు చల్లాలి. 
  • దోమ తెరలు ఉపయోగించాలి. 
  • పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 
  • మొక్కల కుండీలు, పూల కుండీలలో నీళ్లు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. 
  • ఎండాకాలంలో ఉపయోగించిన కూలర్లలోని నీటిని పూర్తిగా తీసేసి పక్కన పెట్టాలి. వాటిలో నీళ్లు తీయడంలో అశ్రద్ధ చేస్తే ఆ నీటిలో దోమలు వృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడుతుంది. 
  • ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా మూత పెట్టాలి.




Like//Share :